పదర: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన "రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" ముగింపు కార్యక్రమం శనివారం (23 మే 2026) నాగర్కర్నూల్ జిల్లా పదర గ్రామంలోని రైతువేదికలో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) శ్రీ మల్లు రవి, అచ్చంపేట శాసనసభ్యులు (ఎమ్మెల్యే) శ్రీ చిక్కుడు వంశీకృష్ణ హాజరయ్యారు. వీరితో పాటు పీజేటీఏయూ రిజిస్ట్రార్ డాక్టర్ సి.హెచ్. విద్యాసాగర్, డీన్ డాక్టర్ సి.హెచ్. వేణుగోపాల్ రెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే శ్రీ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. రైతులు ఎప్పుడూ ఒకే రకమైన మూస ధోరణిలో వ్యవసాయం చేయరాదని, ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం వరి, మొక్కజొన్న, పత్తి లాంటి సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా.. మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న కూరగాయలు, లాభసాటి పంటలు, అపరాలు (పప్పుధాన్యాలు) మరియు చిరుధాన్యాల (మిల్లెట్స్) సాగుపై దృష్టి పెట్టాలని కోరారు.
అనంతరం ఎంపీ శ్రీ మల్లు రవి మాట్లాడుతూ.. నాణ్యమైన పంటలు పండించడంలో శాస్త్రవేత్తల సూచనలను రైతులు తూచా తప్పకుండా పాటించాలన్నారు. రైతుల అవగాహన కోసం శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో మరిన్ని శిక్షణా కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఆయన కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా 1600 గ్రామాల్లో సదస్సులు: విశ్వవిద్యాలయ డీన్ డాక్టర్ సి.హెచ్. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం యొక్క ప్రగతిని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,600 గ్రామాల్లో దాదాపు 2.5 లక్షల మంది రైతులకు ఆరు ముఖ్యమైన వ్యవసాయ అంశాలపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ వ్యవసాయ విద్యలో విద్యార్థులకు కల్పించిన సదుపాయాలను వివరిస్తూ, రైతు కుటుంబాల్లోని విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
యూరియా వాడకం తగ్గించాలి - శాస్త్రవేత్తల కీలక సూచనలు: పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఎల్. కృష్ణ మాట్లాడుతూ.. మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి రకాలను పరిచయం చేశారు. వ్యవసాయంలో రసాయన యూరియా వాడకాన్ని తగ్గించి, పశువుల ఎరువులు మరియు జీవన ఎరువుల ద్వారా పెట్టుబడి ఖర్చు ఆదా చేసుకోవాలన్నారు. అలాగే సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని, డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల ద్వారా నీటి వినియోగ సామర్థ్యం పెంచాలని కోరారు. సకాలంలో విత్తడం ద్వారా పంట ముగింపు దశలో నీటి ఎద్దడి సమస్య ఉండదని సూచించారు.
ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం. శ్రీధర్ మాట్లాడుతూ.. పంట మార్పిడి ద్వారా, ముఖ్యంగా నూనెగింజలు మరియు ఆముదం పంట విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా స్థిరమైన ఆదాయం ఎలా సంపాదించవచ్చో వివరించారు.
అనంతరం జరిగిన రైతులు-శాస్త్రవేత్తల ముఖాముఖి (Face-to-Face) కార్యక్రమంలో అన్నదాతలు తమకున్న సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈశ్వర్ రెడ్డి, స్రవంతి, షైలా, జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, పదర మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు మరియు వందలాది మంది రైతులు పాల్గొన్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com